Mahesh Babu: 'శ్రీమంతుడు' క్లైమాక్స్ ఇలా కూడా తీయవచ్చు: పరుచూరి గోపాలకృష్ణ

  • ఊళ్లో వాళ్లు తిరగబడేలా చేయవచ్చు
  • విలన్ గ్యాంగ్ ఊరొదిలి పోయేలా చూపించవచ్చు
  • జనం ఏం చేయాలో హీరో చెప్పేశాడు

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'శ్రీమంతుడు' సినిమా క్లైమాక్స్ ను గురించి ప్రస్తావించారు. 'శ్రీమంతుడు' సినిమాలో మహేశ్ బాబు విలన్ గ్యాంగ్ ను ఫ్యాక్టరీలో తగలబెట్టడమనేది కొంతమంది ఆడియన్స్ కి ఐ జర్క్ లాగా అనిపిస్తుంది. మేనేజర్ కూతురు పెళ్లికి 20 లక్షలు ఇచ్చిన ఉదాత్తమైన మనసున్నవాడు, ఇంతటి హింస చేయగలడా అని అనుకుంటే, ఈ కథకి మరో ముగింపు రాసుకోవచ్చు.

 'మూడు వేలమంది వున్నారు .. ముప్పై మందిపై తిరగబడలేరా?' అని ఊళ్లో జనాన్ని మహేశ్ రెచ్చగొట్టాలి. దాంతో వాళ్లంతా ఒక్కసారిగా విలన్ గ్యాంగ్ పై దాడికి దిగుతారు. ప్రధానమైన విలన్స్ తో మహేశ్ పోరాడతాడు. క్షమించమని విలన్స్ మహేశ్ కాళ్లు పట్టుకుంటారు. కట్ చేస్తే ఎప్పటిలానే ఆ ఊరికి బస్సు వస్తుంది. ఆ ఊరి జనం .. మహేశ్ బాబు చూస్తుండగా విలన్ గ్యాంగ్ ఆ బస్సు ఎక్కి వెళ్లిపోతుంది. అప్పుడు మహేశ్ బాబు .. 'ఇక ఈ ఊరి నుంచి వెళ్లవలసిన వాళ్లు ఎవరూ లేరు .. వెళ్లవలసిన వాళ్లు వెళ్లిపోయారు' అంటాడు. మళ్లీ అలాంటివాళ్లు ఊళ్లోకి వస్తే ఏం చేయాలనేది ఊళ్లో వాళ్లకి హీరో నేర్పేశాడు కాబట్టి ఇక సమస్య రాదు' అని చెప్పుకొచ్చారు. 

More Telugu News