Bhadradri Kothagudem District: 15 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి... భవనం పైనుంచి దూకేసిన ప్రేమజంట!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • భవంతిపై నుంచి దూకిన లవర్స్
  • అబ్బాయి మృతి, ప్రాణాలతో పోరాడుతున్న బాలిక

వారిద్దరూ మైనర్లు. తమ మధ్య ఏర్పడిన ఆకర్షణనే ప్రేమని భావించారు. క్షణికావేశంలో ఇద్దరూ కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, అబ్బాయి మరణించాడు. అమ్మాయి ఇప్పుడు మృత్యువుతో పోరాడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన ఘటన పూర్వాపరాల్లోకి వెళితే, ఇక్కడి బాపూజీ నగర్ లో నివాసం ఉండే పదో తరగతి చదువుతున్న బాలికకు, కేటీపీఎస్ కాలనీలో డిప్లొమా చదువుతున్న పోశం మణికంఠతో పరిచయం ఉంది.

వీరిద్దరి మధ్యా గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుండగా, ఏం జరిగిందో సమాచారం లేదుగానీ, ఆదివారం సాయంత్రం, నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపైకి ఎక్కిన వీరు, పైనుంచి కిందకు దూకారు. అదే సమయంలో అటుగా వెళుతున్న స్థానికులు, 108కు సమాచారం ఇవ్వగా, వారిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మణికంఠ చనిపోయాడు. బాలిక కాళ్లు, చేతులు విరిగి, ముఖానికి తీవ్ర గాయాలైన స్థితిలో ఉండగా, మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సివుందని పోలీసులు వ్యాఖ్యానించారు.

More Telugu News