Three Twins: ఐస్ క్రీమ్ ధర రూ. 42 లక్షలు... అందుకే అంత స్పెషల్!

  • కాలిఫోర్నియాకు 'త్రీ ట్విన్స్' ఆఫర్
  • టాంజానియాలోని కిలిమంజారో పర్వతానికి తీసుకెళ్లే సంస్థ
  • అక్కడి హిమనీ నదాల నుంచి మంచు సేకరణ
  • ఇద్దరికయితే రూ. 24 లక్షల డిస్కౌంట్ కూడా

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ ధర 60 వేల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 42 లక్షలు) మాత్రమే. ఆ ఐస్ క్రీమ్ ను కాలిఫోర్నియాకు చెందిన 'త్రీ ట్విన్స్' అనే సంస్థ అందిస్తోంది. ఒక ఐస్ క్రీమ్ ఖరీదు అంత ఏంటని భావిస్తున్నారా? అందుకే డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ఒకేసారి ఇద్దరు తినాలని భావిస్తే, రూ. 24 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది కూడా. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

ఈ ఐస్ క్రీమ్ కావాలని అనుకుంటే, ముందుగా డబ్బు చెల్లించాలి. ఆపై మిగతా కథంతా 'త్రీ ట్విన్స్' నడిపిస్తుంది. ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణంతో టాంజానియా తీసుకెళుతుంది. ఓ లగ్జరీ రిసార్టులో బస ఏర్పాటు చేస్తుంది. ఆపై ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో పైకి పంపుతుంది. భయపడాల్సిన పనిలేదు. కస్టమర్ తో పాటు గైడ్ ను కూడా పంపుతారు. ఆపై కస్టమర్ అక్కడికి చేరుకున్నాక, 'త్రీ ట్విన్స్' యజమాని గోటిబ్ అక్కడికి వస్తారు. పర్వతంపై గడ్డకట్టుకుని ఉన్న హిమనీ నదాల నుంచి మంచును సేకరించి కిందకు తీసుకువచ్చి ఐస్ క్రీమ్ ను తయారు చేసి అందిస్తారు.

ఐస్ క్రీమ్ తయారీ కూడా ఓ ప్రత్యేక పద్ధతిలో కుండలో సాగుతుంది. ఇక ఎవరైనా వచ్చి ఈ ఖరీదైన ఐస్ క్రీమ్ తిని వెళితే, అందులో రూ. 7 లక్షలను ఆఫ్రికాలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే సంస్థకు ఇస్తామని కూడా గోటిబ్ చెబుతున్నారు. ఒకరికి అయితే, రూ. 42 లక్షల వరకూ ఖర్చయ్యే ఈ కాస్ట్ లీ ఐస్ క్రీమ్, ఇద్దరికయితే, రూ. 60 లక్షలకే లభిస్తుంది.

More Telugu News