రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే జగన్ నడుస్తున్నారు: బొత్స

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని, ఆయన అడుగు జాడల్లోనే జగన్ నడుస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలోని శ్రావణి కల్యాణ మండపంలో పార్టీ నియోజక వర్గ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది.

ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్.కోట నియోజకవర్గంలో తమకు తిరుగులేదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేది మాత్రం వైసీపీయేనని అన్నారు. ఎస్.కోటలో గెలుపునకు అంతా సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలను ఆయన కోరారు. ఈనెల 17న ప్రజా సంకల్ప యాత్రకు జగన్ పిలుపునిచ్చారని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడిందని తెలిపారు. మరో రెండు రోజుల్లో కొత్త తేదీని ప్రకటిస్తామని, ఈ యాత్ర కోసం భారీగా జనసమీకరణ చేయాలని కార్యకర్తలకు సూచించారు.


More Telugu News