రూ. 20 వేల కోసం బాలుడి కిడ్నాప్.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్!

షార్ట్స్‌లో చూడండి
ఫుట్‌పాత్‌పై తల్లి చెంత నిద్రిస్తున్న ఏడాది వయసున్న బాలుడిని అపహరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిడ్డలు లేని దంపతులకు రూ.20 వేలకు విక్రయించేందుకు ఓ ఆటో డ్రైవర్ ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన మౌనికకు సల్మాన్ అనే ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఉల్లిపాయలు విక్రయించుకుని జీవనం సాగించే ఆమె సోమవారం రాత్రి మలక్‌పేటలో ఫుట్‌పాత్‌పై బాబుతో కలిసి నిద్రించింది.

ఓల్డ్ మలక్‌పేటలోని అయోధ్యనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ సురేశ్.. ఆమె చెంత నిదిరిస్తున్న బాబును అపహరించి తీసుకెళ్లి, తన స్నేహితుడైన రాజ్‌కుమార్‌కు అప్పగించాడు. ఉదయం లేచి చూసే సరికి తన పక్కన బాలుడు కనిపించకపోవడంతో మౌనిక చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వెతకడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు బాలుడ్ని తీసుకొచ్చి వదిలేశారు. పిల్లలు లేని తనకు ఓ బాలుడ్ని తీసుకొచ్చి ఇస్తే రూ.20 వేలు ఇస్తానని చెప్పడంతోనే కిడ్నాప్‌కు పాల్పడినట్టు సురేశ్ పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేశ్, రాజ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Kidnap
Hyderabad
Malkpet
Telangana
Police

More Telugu News