ఆ మంత్రిని ‘గంటా’ అంటారు!: వైఎస్ జగన్

విశాఖపట్టణంలో తనవి కాని భూములకు కూడా పత్రాలు సృష్టించి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న మంత్రి.. ఆ మంత్రిని గంటా శ్రీనివాసరావు అంటారంటూ వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. విశాఖపట్టణం శివారులోని కంచరపాలెంలో జరుగుతున్న బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం మంత్రుల భూముల జోలికి పోదని, పేదల భూములను మాత్రం లాక్కుంటుందని మండిపడ్డారు.

 రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఊదరగొడుతున్నారని, రాష్ట్రంలో వందల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని, చంద్రబాబు వన్నీ ఉత్త మాటలేనని, ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఏడాదికి కనీసం 5 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదన్న విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలే స్పష్టం చేశాయని అన్నారు. ఐటీ సిగ్నేచర్ టవర్స్ పేరుతో సినిమా చూపించారని, విశాఖలో మెట్రో రైలు, సైన్స్ సిటీ, భీమిలి-కాకినాడ తీరం వెంబడి రహదారి, సబ్బవరంలో భారీ పరిశ్రమలు, కూచిపూడి కళాక్షేత్రం, స్పోర్ట్స్ వర్శిటీ ఎక్కడైనా కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు.

విశాఖలో ఎక్కడ చూసినా భూ దోపిడీ యథేచ్ఛగా జరిగిందని, భూములను దోచుకుని గీతం వర్శిటీకి ధారాదత్తం చేశారని, చంద్రబాబు తన బినామీ ఎంవీవీఎస్ మూర్తికి భూములను దోచిపెట్టారని ఆరోపించారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతారని, కంప్యూటర్లకు కూడా అబద్ధాలు నేర్పించగలరని, అబద్ధాలు చెప్పడంలో ఆయన పీహెచ్ డీ చేశారని దుయ్యబట్టారు. 

ys jagan
Ganta Srinivasa Rao
Vizag

More Telugu News