ఉమ్మడి హైకోర్టు విభజనకు రంగం సిద్ధం.. జనవరి నుంచి వేర్వేరు కోర్టులు!
- జనవరి ఒకటి నాటికి హైకోర్టు విభజన
- సంక్రాంతి తర్వాతి నుంచి ఏపీలో కేసుల విచారణ
- ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతి నోటిఫికేషన్
హైకోర్టు విభజన, ఇతర అంశాలపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్తో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు సమావేశమై చర్చించారు. అయితే, నవ్యాంధ్రలో ఏర్పాట్లు పూర్తయిన తర్వాతే హైకోర్టును విభజించాలని ఉమ్మడి కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును వేణుగోపాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అమరావతిలోని నేలపాడు, తుళ్లూరు గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న జుడీషియల్ కాంప్లెక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గత శనివారం నిర్మాణ పనులను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కైత్, జస్టిస్ సీతారామమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుకు ఈ భవన సముదాయం సరిపోతుందని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. ఈ భవన నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తవుతాయి. కాబట్టి జనవరి 1 నాటికి హైకోర్టును విభజించి, సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మరో ఒకటి రెండు రోజుల్లోనే రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.