కేరళకు ఇప్పుడు కావాల్సింది ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు.. వేలాదిమంది అవసరం ఉందన్న కేంద్రమంత్రి!

జలవిలయంతో కకావికలమైన కేరళను ఆదుకునేందుకు ఇప్పుడు నిపుణుల అవసరం ఉందని కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్ పేర్కొన్నారు. వరదల కారణంగా విధ్వంసమైన కేరళను చక్కదిద్దేందుకు ఇప్పుడు వేలాదిమంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్ల సాయం అవసరమన్నారు. ఈ మేరకు తమకు సాయం చేసేందుకు ముందుకొస్తున్న వారికి ఓ విజ్ఞప్తి చేశారు. దుస్తులు, ఆహారం తమకు అవసరం లేదని, సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు వచ్చి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు.

వరదల్లో చిక్కుకున్న వారికి కేంద్ర బలగాలు అద్భుతమైన సాయం చేస్తున్నాయని మంత్రి ప్రశంసించారు. లక్షలాదిమంది నిరాశ్రయులు శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, జిల్లా కలెక్టర్లు కో ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని వివరించారు. వరదల్లో తమవంతు సాయం అందిస్తున్న జాలర్లను ఆయన కొనియాడారు. 600 మంది జాలర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు.


More Telugu News