kashmir: స్వాతంత్ర్య దినోత్సవం నాడు బోసిపోయిన కశ్మీర్ లోయ

  • కశ్మీర్ లోయలో బంద్ కు పిలుపునిచ్చిన వేర్పాటు వాదులు
  • మూతపడ్డ వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, పాఠశాలలు
  • భారీగా మోహరించిన పారామిలిటరీ, పోలీసు బలగాలు
దేశమంతా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటే... కశ్మీర్ లోయ మాత్రం చిన్నబోయింది. కశ్మీర్ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, దీనికి నిరసనగా బంద్ ను పాటించాలని వేర్పాటు వాదుల గ్రూప్ అయిన జాయింట్ రెసిస్టెన్స్ లీడర్ షిప్ (జేఆర్ఎల్) పిలుపునివ్వడమే కారణం. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయలో వాణిజ్య సంస్థలు, దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి.

కశ్మీర్ ప్రజలు ముఖ్యంగా యువత గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతోందని ఓ ప్రకటన ద్వారా జేఆర్ఎల్ పేర్కొంది. ప్రశ్నించిన వారిని జైళ్లలోకి నెడుతున్నారని మండిపడింది. ప్రజలకు జీవించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ ఎత్తున పారామిలిటరీ, పోలీసు బలగాలు మోహరించాయి. శ్రీనగర్ సిటీ ఎంట్రీ, ఎగ్జిట్ ల వద్ద బ్యారికేడ్లను ఉంచి, భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు.  
kashmir
bandh
independence day

More Telugu News