BJP: బీజేపీతో పొత్తు కథనాలు దుష్ప్రచారమే: రోజా

  • వైసీపీ, బీజేపీ కలిశాయని టీడీపీ దుష్ప్రచారం
  • ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న తెలుగుదేశం
  • బీజేపీతో పొత్తుతో అధికారంలోకి వచ్చింది టీడీపీయే
  • 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదన్న రోజా
బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తి వాస్తవ విరుద్ధమని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, తమ పాలన సరిగ్గా లేదు కాబట్టే, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

 తెలుగుదేశం పార్టీయే బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చిందని, అసలు ఆ పార్టీ పొత్తు లేకుండా ఎన్నడూ అధికారంలోకి రాలేదని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్ కు ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారని అన్నారు. జగన్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జగన్ కూడా చెప్పారని గుర్తు చేసిన రోజా, గ్రామదర్శిని పేరిట గ్రామాల్లోకి వచ్చే తెలుగుదేశం నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

More Telugu News

BJP
YSRCP
Roja
Telugudesam