Andhra Pradesh: ఏపీలో మెజారిటీ పరిశ్రమలు అప్రెంటిస్ షిప్ విధానం అమలు చేయట్లేదు: మంత్రి కొల్లు రవీంద్ర

  • ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’ సదస్సు 
  • రాష్ట్రంలో రెండు లక్షల వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి
  • అప్రెంటిస్ షిప్ విధానంపై పరిశ్రమల్లో ఉన్న అపోహలు పోవాలి

రాష్ట్రంలో 2 లక్షల వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో మెజారిటీ పరిశ్రమలు అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేయడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అప్రెంటిస్ షిప్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. విశాఖపట్నంలోని నొవాటెల్ హోటల్ లో ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’ పేరిట ఒక రోజు సదస్సును ఈరోజు నిర్వహించారు.

ఈ సందర్భంగా ‘నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్‘ బ్రోచర్ ను ఆవిష్కరించారు. అనంతరం, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అప్రెంటిస్ షిప్ విధానంపై పరిశ్రమల్లో ఉన్న అపోహలను తొలగించేందుకే రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒక రోజు అవగాహనా సదస్సు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే కేంద్రం అప్రెంటిస్ షిప్ విధానంలో ఎన్నో సవరణలు చేసిందని, ఏదైనా పరిశ్రమ అప్రెంటిస్ ద్వారా ఒక వ్యక్తికి శిక్షణ ఇస్తే.. అతనికి ఇచ్చిన స్టైఫండ్ లో 25 శాతాన్ని ప్రభుత్వం కంపెనీకి తిరిగి చెల్లిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే నిరుద్యోగ భృతిని అమలు చేయబోతోందని చెప్పారు.

ఇప్పటి వరకు 22 నుంచి 35 ఏళ్ల వయస్సున్న నిరుద్యోగులు 10 లక్షల మంది ఉన్నట్టు గుర్తించామని, వాళ్లందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వడమే కాకుండా, వాళ్లని అప్రెంటిస్ షిప్ తో అనుసంధానించాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. అంతే కాకుండా, ఆక్వా, అగ్రి, హార్టికల్చర్ తోపాటు హాస్పిటాలిటీ, రీటైల్, అపెరల్, లాజిస్టిక్ రంగాల్లో కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, యువతకు ఈ తరహా శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు లాంటి సమర్థవంతమైన నేత ఉండడం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని చెప్పారు. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్) లో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగానే ఏపీఎస్ఎస్ డీసీ యువతలో నైపుణ్యాలు పెంచడానికి ఎన్నో శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తోందని, ఇప్పటికైనా అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేయడానికి అన్ని రకాల పరిశ్రమలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
 పరిశ్రమలకు ఎన్నో అపోహలు ఉన్నాయి

అంతకుముందు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి, సీఈవో కె సాంబశివరావు మాట్లాడుతూ, అప్రెంటిస్ షిప్ ను అమలు చేసే విషయంలో పరిశ్రమలకు ఎన్నో అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకే వివిధ పరిశ్రమలు, ట్రైనింగ్ పార్ట్ నర్స్ తో ఈ సదస్సు ఏర్పాటు చేశామని, నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ ను మరింత సులువుగా అమలు చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ స్కీమ్ ప్రస్తుతం ఐటీఐ, తయారీ రంగాలకే పరిమితమై ఉందని, దీన్ని సర్వీస్ సెక్టార్స్ లోనూ అమలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అప్రెంటిస్ షిప్ అనేది ఉద్యోగం కాదని, భవిష్యత్తులో ఉద్యోగం పొందడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుందని, దీన్ని అమలు చేయడానికి పరిశ్రమలంతా సహకరించాలని సూచించారు.  

అప్రెంటిస్ షిప్ విధానం యువతకే కాదు పరిశ్రమలకూ ఉపయోగకరం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అప్రెంటిస్ షిప్ విధానాన్ని అమలు చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉందని డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రెటరీ రాజేష్ అగర్వాల్ అన్నారు. అప్రెంటిస్ షిప్ విధానం యువతతో పాటు పరిశ్రమలకు కూడా ఉపయోగకరమని, జర్మనీలో అప్రెంటిస్ విధానం విజయవంతంగా అమలు అవుతోందని, మన దేశంలో మాత్రం ఇప్పటికీ ముందుకు రావడం లేదని చెప్పారు.

ఈ స్కీమ్ అమలు కోసం కేంద్రం 10 వేల కోట్లు కేటాయించిందని.. ఇప్పటి వరకు కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగామని అన్నారు. పరిశ్రమల్లో ఉన్న అపోహలు తొలగించడం జరుగుతోందని, అప్రెంటిస్ షిప్ ను అమలు చేయడానికి కేంద్రం ప్రత్యేకంగా ఒక పోర్టల్ రూపొందించిందని, ఇందులో పరిశ్రమలు, అప్రెంటిస్ షిప్ పొందాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. దేశంలో 83 శాతం మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు రావడం లేదని అలాంటి వారందరికీ అప్రెంటిస్ షిప్ ను వర్తింపజేసి సర్వీస్ సెక్టార్ ద్వారా ఉపాధి పొందవచ్చని సూచించారు.యువతకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది

అప్రెంటిస్ షిప్ ద్వారా యువతకు ఆర్థికంగా కొంత వెసులుబాటుతోపాటు నైపుణ్యం పొందే అవకాశం కలుగుతుందని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఫర్ స్కిల్ డెవలప్ మెంట్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఇన్నొవేషన్ జెఎస్వీ ప్రసాద్ అన్నారు. నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దాంతోపాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను కూడా దీనికి పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపిఎస్ఎస్ డిసి) ద్వారా దాదాపు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలలో సాఫ్ట్ స్కిల్స్ తోపాటు అనేక రకాల నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని, అంతేకాకుండా ఆధునిక టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్, డస్సాల్ట్, గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.  

అప్రెంటిస్ షిప్ విధానం అమలుకు పరిశ్రమలు సహకరించాలి

రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగ భృతిని అమలు చేయబోతోందని, అప్రెంటిస్ షిప్ విధానాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి పరిశ్రమలు సహకరించాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ యూత్ అఫైర్స్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. అప్రెంటిస్ షిప్ విధానం అమలుపై ఉన్న అపోహలను తొలగించేందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. కాగా, రెండో సెషన్ లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం వివిధ పరిశ్రమల ప్రతినిధులు, ట్రైనింగ్ పార్ట్ నర్స్ తో కలిసి చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అప్రెంటిస్ షిప్ అమలులో పరిశ్రమల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పలువురు నిపుణులు సమాధానాలు ఇచ్చారు.

ఈ సదస్సులో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో కె.సాంబశివరావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం(స్పెషల్ చీఫ్ సెక్రెటరీ యూత్ అఫైర్స్), జెఎస్వీ ప్రసాద్(రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ) రాజేష్ అగర్వాల్(జాయింట్ సెక్రెటరీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా)తో పాటు ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మినారాయణ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పరిశ్రమల ప్రతినిధులు, ట్రైనింగ్ పార్ట్ నర్స్ హాజరయ్యారు.ఇదిలా ఉండగా, అప్రెంటిస్ షిప్ విధానం ఇప్పటివరకు కేవలం ఐటీఐలు, తయారీ రంగం పరిశ్రమల్లో మాత్రమే అమలవుతోంది. దీంతో 1961లో ఉన్న అప్రెంటీస్ షిప్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సవరణలు చేసింది. ఈ చట్ట సవరణ ప్రకారం అప్రెంటిస్ షిప్ విధానాన్ని అన్ని రంగాల్లోనూ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించి 2016 ఆగస్టులో నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్ ను ప్రారంభించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం వ్యక్తులకు అప్రెంటిస్ షిప్ శిక్షణ ఇచ్చిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క అభ్యర్థికి రూ.1500 చొప్పున స్టైఫండ్ రూపంలో చెల్లించనుంది.

2020 నాటికి ఈ అప్రెంటిస్ షిప్ శిక్షణ ద్వారా 50 లక్షల మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయస్థాయిలో అప్రెంటిస్ షిప్ విధానాన్ని నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్‌డిసి), రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) కలిసి అమలు చేయనున్నాయి. అందులో భాగంగా ఈ అప్రెంటీస్ షిప్ విధానంలో షార్ట్ టర్మ్ కోర్సులను రీటైల్, అపెరల్, లాజిస్టిక్, హాస్పటాలిటీ ఇలా అన్ని రంగాల్లో అమలు చేయబోతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అప్రెంటీస్ షిప్ శిక్షణలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను భాగస్వాములను చేసి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది.  

More Telugu News