Pawan Kalyan: ఇక టార్గెట్ పవన్ కల్యాణ్ : నేతలకు టీడీపీ అధిష్ఠానం ఆదేశాలు

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీని, ఏపీ సర్కారును టార్గెట్ చేసుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసే విమర్శలపై దీటుగా స్పందించాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ మంత్రులు, నేతలకు ఆదేశాలు అందినట్టు సమాచారం. పవన్ విమర్శలపై గట్టిగా ప్రతిస్పందించాలని, ఆయన చేసే ఆరోపణలలోని డొల్లతనాన్ని బయటపెట్టేలా విమర్శనాస్త్రాలకు పదును పెట్టాలని టీడీపీ నాయకత్వం కింది స్థాయి నేతలకు సూచించింది. నిన్నమొన్నటి వరకూ టీడీపీకి మిత్రుడిగా ఉన్న పవన్ ను ఇక ఆ దృష్టితో చూడవద్దని, వైకాపా నేతల మాదిరే బద్ధ శత్రువుగా భావించాలని కూడా టీడీపీ నిర్ణయించింది.

ఇప్పటివరకూ పవన్ ఆరోపణలపై తెలుగుదేశం నేతలు ఆచితూచి స్పందిస్తుండగా, దీనివల్ల కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని భావించిన పార్టీ పెద్దలు, ఇకపై ఆయన విమర్శలను తీవ్రంగా తిప్పి కొట్టాలని తేల్చారు. ఎన్నికల వేళ పవన్ ఆరోపణల ప్రభావం ఓటర్లపై పడకుండా చూసేందుకు ఎదురుదాడి చేయడమే సరైన మార్గమని, వైకాపాపై ఎలా విరుచుకుపడుతున్నామో, పవన్ పై కూడా అంతే స్థాయిలో విమర్శలు గుప్పించాలని చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుండగా, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని పవన్ కల్యాణ్ వేలెత్తి చూపడం లేదని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ నోటి నుంచి టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు వస్తే, వాటిని తక్షణం ఎండగట్టేందుకు సిద్ధంగా ఉండేందుకు నేతలు సన్నద్ధమవుతున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Jana Sena

More Telugu News