Jana sena: ఇక మహిళా సమస్యలపై దృష్టి: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో చేపట్టిన ‘జనసేన పోరాట యాత్ర’ ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఇకపై మహిళల సమస్యలపై దృష్టి సారిస్తానని చెప్పారు. పోరాట యాత్ర ద్వారా ఎన్నో తెలుసుకున్నానన్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశానని చెప్పారు. వారి కుటుంబంలో ఒకరిగా వారి బాధలు, వ్యథలు విన్నానని పేర్కొన్నారు. ఓ లక్ష్యంతో ఏర్పడిన జనసేన రాజకీయంగా పెను మార్పులు తీసుకొస్తుందన్నారు. రాజకీయ నాయకుల దోపిడీని నిలువరిస్తుందని పేర్కొన్నారు.

లక్షలాది మంది మహిళల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయికి వచ్చానన్న పవన్, మహిళల పాలసీ రూపకల్పనపై ఇక దృష్టి సారిస్తానన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నేతలు రాష్ట్రాభివృద్ధి కంటే స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. సమాజంలో మార్పు కోసం పోరాడుతున్న తనపై ఎవరైనా దాడి చేస్తే ఊరుకునేది లేదని, ఇకపై మరింత బలంగా పోరాడతామని పవన్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే విశాఖ మహిళా విభాగం నేతలతో ఆత్మీయ సదస్సు నిర్వహిస్తానని జనసేన అధినేత పేర్కొన్నారు.
Go Back to Shorts
Jana sena
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News