Hyderabad: జూబ్లీహిల్స్ లో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

  • మాజీ డీజీ మీనా ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్  
  • ఏకే 47తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం
  • తప్పిన ప్రమాదం.. అపోలో ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. స్థానిక ప్రశాసన్ నగర్ లోని మాజీ డీజీ ఆర్పీ మీనా ఇంటి వద్ద  కానిస్టేబుల్ కిషోర్ బాబు విధులు నిర్వహిస్తున్నాడు. తన వద్ద ఉన్న ఏకే 47తో కాల్చుకుని ఇతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే, అతనిని సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్లు ఛాతీ పక్క నుంచి దూసుకెళ్లాయని, అతని ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ సమాచారం మేరకు కిషోర్ బాబు భార్య, పిల్లలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

కాగా, కిషోర్ బాబు ఆత్మహత్యాయత్నంపై భిన్న కథనాలు వినపడుతున్నాయి. కిషోర్ బాబు ఆత్మహత్యకు యత్నించలేదని ప్రమాదవశాత్తు తుపాకి పేలిందని అతనితో పాటు అక్కడే విధులు నిర్వహిస్తున్న వారు చెబుతున్నారు. మరోపక్క, సంఘటనా స్థలంలో కిషోర్ బాబు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్య వేధింపుల కారణంగా అతను ఆత్మహత్యాయత్నం చేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad
jublihills

More Telugu News