జీఎస్టీని సరళం చేయాలంటే ముందుగా 28 శాతం శ్లాబ్ ను ఎత్తేయాలి!: అరవింద్ సుబ్రమణియన్

వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను సరళతరం చేసేందుకు ముందు 28 శాతం పన్ను రేటును ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సూచించారు. త్వరలోనే సుబ్రమణియన్ తన పదవికి రాజీనామా చేసి అమెరికా వెళ్లిపోనున్నారు. ఈ క్రమంలో ఆయన జీఎస్టీ గురించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. జీఎస్టీలో ఒకే విధమైన పన్ను రేటు ఉండడం అన్నది సరళతరానికి మొదటి అడుగుగా పేర్కొన్నారు.

‘‘28 శాతం పన్ను శ్లాబ్ తొలగిపోవాలి. ఒకటే పన్ను రేటు ఉండాలి. ఈ రోజు జీఎస్టీలో 3 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం చొప్పున శ్లాబ్ రేట్లు ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించాల్సి ఉంది. ముందు చర్యగా 28 శాతం పన్ను రేటు తొలగిపోవాలి’’ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉన్నప్పటికీ కీలక అంశాల్లో అరవింద్ సుబ్రమణియన్ తన అభిప్రాయాలను వ్యక్తీకరించే విషయంలో వెనుకాడరు. ఆయన గతంలోనూ ఈ విధంగా అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.  


More Telugu News