adi narayana reddy: అమిత్ షా వద్దకు కూడా వెళ్లలేని స్థాయి నీది.. నీవా మాట్లాడేది?: మంత్రి ఆది

షార్ట్స్‌లో చూడండి
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై మంత్రి ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమ గురించి ఓనమాలు కూడా విష్ణుకు తెలియవని అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేయాల్సింది పోయి... ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం దిగజారుడుతనమని దుయ్యబట్టారు.

 ఉక్కు పరిశ్రమ కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో మంత్రి చంద్రమోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వాసుతో సహా బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, ఒంటేరు శ్రీనివాసులు రెడ్డిలు చర్చించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. వెంటనే స్పందించిన వెంకయ్య... కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని పిలిపించి కడప జిల్లాలో త్వరగా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని సూచించిన సంగతి నిజం కాదా? అని అడిగారు. జరిగిన విషయాన్ని బీజేపీ నేతలు ప్రజలకు వివరించాలని అన్నారు.

బీజేపీ నేతలు విష్ణు, రాజమోహన్ రెడ్డిలకు మతి స్థిమితం తప్పినట్టుందని ఆది విమర్శించారు. ఉక్కు పరిశ్రమ ప్రజల హక్కు అని... కేంద్ర ప్రభుత్వం ఆ హక్కును కాలరాస్తుంటే టీడీపీ పోరాటం చేస్తోందని చెప్పారు. బీజేపీ నేతలు ఇలాగే ప్రవర్తిస్తే ప్రజలు తిరగబడటం ఖాయమని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వద్దకు వెళ్లే స్థాయి కూడా లేని విష్ణువర్ధన్ రెడ్డి... ఉక్కు పరిశ్రమపై టీడీపీ చిత్తశుద్ధిని ప్రశ్నించడం సిగ్గు చేటని అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. 
Go Back to Shorts
adi narayana reddy
Vishnu Vardhan Reddy
kadapa
steel plant

More Telugu News