tiruvallur: బాలికపై 21 మంది సామూహిక అత్యాచారం.. వీరిలో పలువురు ఆమెతో కలిసి చదువుకున్నవారే!

  • చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో ఘటన
  • బాలికకు మద్యం, గంజాయి అలవాటు చేసిన ప్రేమికుడు
  • గదిలో బంధించి, సామూహిక అత్యాచారం

చెన్నై సమీపంలోని తిరువళ్లూరులో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే మరో ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికకు మద్యం, గంజాయి అలవాటు చేసి, ఆమెపై ఏకంగా 21 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

తిరువళ్లూరులోని ఓ ప్రాంతంలో కూలి పనులు చేసుకునే దంపతుల కుమార్తె పదో తరగతి వరకు చదివింది. ఆ తర్వాత చదువును ఆపేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో తనతో పాటు చదివిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఆమెను పలు చోట్లకు తీసుకువెళుతూ మద్యం, గంజాయి అలవాటు చేశాడు. ఈ నేపథ్యంలో, గత నెల 5న బాధితురాలు అదృశ్యమైంది. అన్నిచోట్ల వెతికిన తల్లిదండ్రులు చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో బాలిక కోసం పోలీసులు గాలిస్తుండగా... బస్టాండు వద్ద మత్తులో ఉన్న స్థితిలో బాధితురాలు కనిపించింది. ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ జరపగా, ఓ గదిలో తనను బంధించి, ప్రేమికుడు సహా 21 మంది తనపై అత్యాచారం జరిపినట్టు తెలిపింది. వీరిలో పలువురు ఆమెతో పాటు చదివిన వారే ఉండటం గమనార్హం. అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరచగా... న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు వారిని పుళల్ జైలుకు తరలించారు. 

More Telugu News