అమరావతిలో సైకిలెక్కిన చంద్రబాబునాయుడు!
- హోదా కోసం ఏపీ సీఎం నిరసన
- వెంకటపాలెం నుంచి అసెంబ్లీకి సైకిల్ పై యాత్ర
- అనుసరించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- మరింతగా ఉద్యమిస్తామని చంద్రబాబు హెచ్చరిక
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారని, వారికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. ఎంపీల పోరాటాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు అభినందిస్తున్నారని తెలిపారు. ఒక సంకల్పంతో తాము చేస్తున్న పోరాటంలో విజయం సాధించాలంటే ప్రజల మద్దతు ఎంతైనా అవసరమని చంద్రబాబు అన్నారు. టీడీపీ చేస్తున్న పోరాటంలో ఓ చిత్తశుద్ధి ఉందని, లక్ష్యసిద్ధి కోసం పోరాడుతున్నామని తెలిపారు.
హోదా సాధన ప్రతి ఒక్కరి విధి, కర్తవ్యం, బాధ్యతగా భావించాలని చంద్రబాబు సూచించారు. నిన్న రాజ్యసభలో టీడీపీ ఎంపీల మెరుపు ధర్నాతో జాతీయ స్థాయిలో ప్రకంపనలు వచ్చాయని, తమ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎంపీల పోరు రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచిందని, నేడు పార్లమెంట్ చివరి రోజున మరింత ఉద్ధృతంగా నిరసనలు తెలియజేయనున్నామని చంద్రబాబునాయుడు తెలియజేశారు.