Prakash Raj: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్ర‌కాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • హిందూవాదం కర్ణాటకలో పనిచేయదు
  • హిందుత్వ పార్టీలు కన్నడ ప్రజలను విడగొట్టలేవు
  • ఏ పార్టీ గెలుస్తుందో మీరే చూస్తారు

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌ర్ణాట‌క‌లో బీజేపీ గెలుస్తుందా? లేదా? అన్న విష‌యాన్ని కొన్ని రోజుల్లో మీరే చూస్తార‌ని సినీన‌టుడు ప్ర‌కాశ్ రాజ్ మీడియాతో అన్నారు. క‌ర్ణాటకవాసులు ఎంతో సహనంతో ఉంటారని, వారిని ఏ హిందుత్వ పార్టీలు విడగొట్టలేవని వ్యాఖ్యానించారు. మతం పేరుతో ప్రచారం చేస్తున్న వారిని ఆ రాష్ట్ర ప్రజలు అంగీక‌రించ‌బోర‌ని బీజేపీని విమ‌ర్శించారు.

తాజాగా, ఓ జాతీయ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చ‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... కర్ణాటక వాసులు అందరితో కలిసి జీవిస్తార‌ని, అందరిని ఆదరిస్తార‌ని, సామరస్యంగా ఉంటార‌ని చెప్పారు. ఆ రాష్ట్రంలో బహుళ సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఏడాది మే 12న ఒకే దశలో జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు మే15న వెలువడతాయి.  

More Telugu News