Jana Sena: ఆ ముగ్గురి త్యాగాలనూ స్మరించుకుంటూ.. ఆ స్ఫూర్తితో పోరాటం!: పవన్ కల్యాణ్ ప్రకటన

షార్ట్స్‌లో చూడండి
స్వాతంత్ర్య స‌మ‌రయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల స్ఫూర్తితో ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. "1931లో ఇదే రోజు మాతృ దేశం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ బలిదానం చేశారు. బానిస శృంఖలాల నుంచి భారత మాతని విడిపించేందుకు... భావి తరాల కోసం తమ జీవితాలని అర్పించారు. వారి త్యాగాలు లక్షల మంది మనసుల్ని జ్వలింపచేశాయి. ఈ రోజుకీ ఎక్కడైనా అన్యాయంపై ఎదురుతిరగడంలో ఆ త్యాగధనుల జీవితాలు ఇచ్చిన స్ఫూర్తే ఉంటుంది.

ఉరి కంబాన్ని ఎక్కే కొన్ని రోజుల ముందు భగత్ సింగ్ తన మాతృమూర్తితో ఇలా అన్నారు.. నేను చనిపోకపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. నేను నవ్వుతూ మృత్యువుని అల్లుకొంటే... భారత దేశంలో ఉన్న మాతృమూర్తులు అందరూ తమ బిడ్డలు భగత్ సింగ్ లా కావాలని కోరుకొంటారు. బలీయమైన స్వాతంత్ర్య కాంక్ష ఉన్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు. అప్పుడే విప్లవయోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్ట శక్తులకు సాధ్యం కాదు.

అప్పుడు భగత్ సింగ్ తల్లి ఇలా స్పందించారు.. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. గొప్ప మరణం అనేది ఎలా ఉంటుందంటే ప్రపంచమంతా ఆ మరణం గురించే చెప్పుకొంటుంది. తన బిడ్డ ఉరి కొయ్యని ముద్దాడే ముందు ఇంక్విలాబ్ జిందాబాద్ అనిపించిందా మాతృమూర్తి. భగత్ సింగ్ ఔన్నత్యాన్ని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ విధంగా కొనియాడారు. మేధావి అనే పదానికి అసలైన అర్థం ఏమిటంటే... ఓ వ్యక్తి గొప్ప ఆలోచనలతో పరితపించాలి.

భవిష్యత్ తరాల కోసం, జనం కష్టాల పట్ల స్పృహతో, వారి సంక్షేమం కోసం స్వతంత్రమైన ఆలోచనలతో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండాలి. మేధావి అని సాధికారికంగా భగత్ సింగ్ ని పిలిచేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు చేసిన ఆత్మార్పణను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని యువత ఈ రోజు స్మరించుకుంది. ఆర్థికంగా మెరుగైన పరిస్థితుల్ని తీసుకురావడంలో ప్రభుత్వాలూ విఫలం కావడంపై వారి స్పూర్తితో పోరాడుతుంది. నిస్వార్థంగా, సాహసోపేతమైన ఆ ముగ్గురి త్యాగాలను స్మరించుకొంటూ జనసేన సెల్యూట్ చేస్తోంది. జై హింద్"  అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh
Telugudesam

More Telugu News