Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ అల్టిమేటం... 48 గంటల్లో స్పందించకపోతే బంద్!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గుంటూరులో డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్‌ లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. డయేరియా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో స్పందించకపోతే రాష్ట్ర బంద్‌ కు పిలుపునిస్తానని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై అవసరమైతే దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు.

చనిపోయిన వారినెలాగూ తీసుకురాలేమన్న ఆయన, దీనికి ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సురక్షితమైన తాగునీటిని ప్రజలకు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా? అంటూ ఆయన అధికార పక్షాన్ని నిలదీశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులకు సమస్యలు పట్టవా? అని అడిగారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి అసెంబ్లీకి వైఎస్సార్సీపీ వెళ్లదని, అలాంటప్పుడు వారినేమనాలని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Andhra Pradesh
Guntur District

More Telugu News