తాజ్‌మహల్‌ సందర్శకులకు గుడ్‌న్యూస్....ఇక సూర్యోదయానికి ముందే టికెట్ల విక్రయం

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన 'తాజ్‌మహల్'ని సందర్శించాలనుకునే వారికి ఓ శుభవార్త. ఈ అపురూప కట్టడాన్ని వీక్షించాలనుకునే పర్యాటకులు గంటల తరబడి క్యూల్లో పడిగాపులు పడనవసరం లేదు. ఇకపై సూర్యోదయానికి 45 నిమిషాల ముందే టికెట్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. తద్వారా గేట్లు తెరవడానికి ముందే సందర్శకులు టికెట్లు తీసుకుని మహల్ వీక్షణకు రెడీగా ఉండొచ్చు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ ఈ విషయాన్ని ఈ రోజు లోక్‌సభలో వెల్లడించారు.

తాజ్‌మహల్ సందర్శన వేళల్లో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదని ఆయన చెప్పారు. సూర్యోదయానికి 45 నిమిషాల ముందుగా టికెట్ కౌంటర్లను తెరిచి సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు మూసేస్తామని ఆయన తెలిపారు. భారత పురావస్తు శాఖ జనవరి 25, 2018న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, తాజ్ మహల్‌ సందర్శనకు సంబంధించిన ప్రధాన గేట్లను సూర్యోదయానికి అర గంట ముందు తెరిచి, సూర్యాస్తమయానికి అర గంట ముందు మూసేస్తున్నట్లు మంత్రి చెప్పారు. శుక్రవారాల్లో సెలవు కారణంగా వారసత్వ సంపదగా భావితరాలకు అందివస్తున్న మొఘల్ కాలం నాటి ఈ కట్టడ సందర్శనకు వీలుండదు.


More Telugu News