Chandrababu: అమరావతిలో దేశ రెండో రాజధాని, కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి: బీజేపీకి చంద్రబాబు కౌంటర్

  • రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలు ఆడుతోంది
  • ఇన్నాళ్లకు రాయలసీమ గుర్తొచ్చిందా?
  • సీమను ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశాం

కర్నూలు నుంచి బీజేపీ నేతలు ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రాయలసీమను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని చెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో సీమకు నీరు అందించామని తెలిపారు. తాను కూడా రాయలసీమ బిడ్డనే అని చెప్పారు. బీజేపీకి ఇప్పుడు రాయలసీమ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించిన ఆయన... రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.

కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్, అమరావతిలో దేశ రెండో రాజధానిని ఏర్పాటు చేస్తే... అప్పుడు బీజేపీ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సూచించారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామన్న కేంద్ర ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోలేదని... అందుకే తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి చేసే విషయంలో టీడీపీ నేతలు అనుసరించాల్సిన వైఖరిపై ఆయన దిశానిర్దేశం చేశారు. 

More Telugu News