Telangana: మరి, మా నాయకుల కాళ్లు పట్టుకున్నవారిని ఏమనాలి?: టీఆర్ఎస్ పై జానారెడ్డి విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
‘కాంగ్రెస్’ పైన, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైన మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్’ని లోఫర్ పార్టీగా పేర్కొన్న కేటీఆర్ వ్యాఖ్యలపైనే కాదు, టీఆర్ఎస్ ను బ్రోకర్ పార్టీగా ఎవరైనా అభివర్ణించినా తాను ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని అన్నారు. తమ నాయకులను కాలిగోటికి సమానమని పోల్చిన వాళ్లే, మా నేతల కాళ్లు పట్టుకున్నారని, మరి, వాళ్లను ఏమనాలని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ నేతలలా తాము కూడా వ్యాఖ్యలు చేయగలం అనీ, అయితే అందుకు, సభ్యత, సంస్కారం అడ్డొస్తున్నాయని అన్నారు. ఎదుటి వారిని చులకన చేసి తాము గొప్పవాళ్లమవుతామని అనుకోవడం సరికాదని, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఏ పార్టీకి చెందిన నేతలైనా సరే చేయకూడదని, ఇదే విషయమై టీఆర్ఎస్ నేతలకు, తమ పార్టీ నేతలకు చాలాసార్లు చెప్పానని అన్నారు. పరుష పదజాలం వాడటం వల్ల రాజకీయ నాయకులు ప్రజల్లో చులకనవుతారని, వారిపై గౌరవం తగ్గుతుందని, పత్రికలు కూడా ఇలాంటి పదాలను రాయొద్దని ఈ సందర్భంగా జానారెడ్డి సూచించారు.
Go Back to Shorts
Telangana
Congress

More Telugu News