Kerala: పుణ్యానికి పోతే పాపం! బస్సులో నిల్చున్న గర్భిణికి సీటివ్వమన్నందుకు ప్రయాణికుడిపై దాడి.. బస్సులోంచి తోసేసిన వైనం!

  • ప్రయాణికుడిపై ఇతర ప్రయాణికుల దాడి
  • దిగిపోదామనుకునేంతలో బస్సులోంచి తోసేసిన వైనం
  • తలకు తీవ్ర గాయాలు.. కేసు నమోదు

పుణ్యానికి పోతే  పాపం ఎదురవడమంటే ఇదేనేమో! బస్సెక్కిన గర్భిణికి సీటు కోసం ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిపై బస్సులోని మిగతా ప్రయాణికులు దాడి చేశారు. బస్సులోంచి అతడిని లాగి కిందపడేశారు. కేరళలోని కన్నూరులో జరిగిందీ ఘటన.

రాజన్ (50) అనే రోజు కూలీ తన భార్యతో కలిసి వారమ్ బస్టాప్‌లో కన్నూర్ వెళ్లేందుకు బస్సెక్కాడు. ఆ తర్వాత తాలుక బస్టాప్‌లో ఓ గర్భిణి బస్సెక్కింది. బస్సులు కిక్కిరిసిపోయి ఉండడంతో ఆమె నిలబడింది. గమనించిన రాజన్ తన ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు మహిళలను లేచి గర్భిణికి సీటు ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇది గమనించిన బస్సులోని మిగతా ప్రయాణికులు గర్భిణికి సీటు కోసం వారిని ఎలా లేవమంటావంటూ ప్రశ్నించారు. దీంతో బస్సులో వాగ్వాదం జరిగింది.

వివాదం మరింత ముదరడంతో ఎందుకొచ్చిన గొడవని భావించిన రాజన్ దంపతులు వచ్చే స్టాపులో దిగిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతకంటే ముందు జరగరానిది జరిగింది. మిగతా ప్రయాణికులు రాజన్‌ను కొట్టి బస్సు నుంచి బయటకు తోసేశారు. పేవ్‌మెంట్‌కు రాజన్ తల తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కన్నూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News