Parliament: లోక్ సభలో కీలక పరిణామం... టీడీపీ ఎంపీలపై నరేంద్ర మోదీ ఆగ్రహం!

షార్ట్స్‌లో చూడండి
నేటి లోక్ సభలో కీలక పరిణామాలు సంభవించాయి. ఈ ఉదయం నుంచి నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీలు నరేంద్ర మోదీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభలో ప్రసంగిస్తున్న వేళ, పెద్దపెట్టున నినాదాలు చేస్తున్న తెలుగుదేశం ఎంపీలపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను ముక్కలు చేయడంపై పాటించిన వైఖరే ఇంత దూరం తీసుకువచ్చిందని, ఇప్పుడు సభ్యులు ఇలా చేయడం కూడా సరికాదని అన్నారు. ఆంధ్ర ప్రజల అభిమతాన్ని పట్టించుకోకుండానే రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించిన ఆయన, సమస్యలన్నింటినీ తాము పరిష్కరిస్తామని పదే పదే చెబుతుంటే ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు.

విభజన జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత కూడా సమస్యలు ఉన్నాయని తమను నిలదీస్తున్నారని, వీటన్నింటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అని మరచిపోయారని అన్నారు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఏపీని విభజించారని, ఆ తరువాత కాంగ్రెస్ నాశనమైందని వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు ఈ పద్దతిలో నిరసనలు తెలపడం ఎంతమాత్రమూ అంగీకరించేది కాదని అన్నారు. దేనికైనా సమయం వస్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేసే క్రమంలో ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుందని చెప్పారు.

వెంటనే ఆందోళనలను విరమించాలని తాను కోరుతున్నట్టు చెప్పారు. టీడీపీ వైఖరి పార్లమెంట్ కు ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని హితవు పలికారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉండి ఇంతగా నినాదాలు చేయాల్సిన అవసరం ఏంటో తనకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. సభా కార్యక్రమాలను ఎవరు అడ్డుకున్నా తప్పేనని, ఎవరినీ ఉపేక్షించేది లేదని పరోక్షంగా టీడీపీ సభ్యులను హెచ్చరించారు.

తన ప్రసంగంలో ఎన్టీ రామారావును గుర్తు చేసుకున్న ఆయన, టీడీపీ ఆవిర్భావం నాటి పరిస్థితులను ప్రస్తావించడం గమనార్హం. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆయన పోరాడి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆనాడు రాజీవ్ గాంధీ, ఓ దళిత ముఖ్యమంత్రిని అవమానించారని, అంజయ్య, పీవీ నరసింహరావు, నీలం సంజీవరెడ్డి పట్ల కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరించిందని ప్రధాని విమర్శించారు.

ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు సైతం పెద్దపెట్టున నినాదాలు చేస్తూ, మోదీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే, ఏపీలో కాంగ్రెస్ అనేక రాజకీయ దారుణాలు చేసిందని ఆరోపించారు. ఆ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని, ప్రజాస్వామ్యం గురించి మీరా మాట్లాడేది? అంటూ కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని చెబుతూ, నిదానంగా సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆ మేరకు తాను హామీ ఇస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
Parliament
Lok Sabha
Narendra Modi
Telugudesam
Congress

More Telugu News