NRIs: పెళ్లి వెబ్ సైట్ల ద్వారా ఘరానా మోసం చేస్తున్న దీప... గుంటూరులో అరెస్ట్!

  • ఎన్నారైలకు గాలం వేస్తున్న యువతి
  • గుంటూరు కేంద్రంగా మోసపూరిత ప్రకటనలు
  • గతంలో జైలుకు వెళ్లొచ్చినా మారని బుద్ధి

వివాహాలు కుదిర్చే వెబ్ సైట్లలో తప్పుడు ప్రొఫైల్స్ ను పెట్టి, ప్రవాస భారతీయ యువకులకు గాలం వేస్తూ, ఘరానా మోసాలకు పాల్పడుతున్న దీప అనే యువతిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నగర పరిధిలోని బ్రాడీపేటలో నివాసం ఉండే దీప విలాసాలకు అలవాటు పడింది. తేలికగా డబ్బులు సంపాదించాలన్న కోరికతో, తప్పుడు దారిని ఎంచుకుంది. మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో నకిలీ అకౌంట్లు సృష్టించింది.

 ఆపై తనను సంప్రదించే వారిని మోసం చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ధరణి కుమార్ పరిచయం అయ్యాడు. అతన్ని వివాహం చేసుకుంటానని నమ్మించి, తనకు అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి రూ. 1.86 లక్షలు తీసుకుంది. ఆపై మాటలు మారుస్తుంటే, తన డబ్బు తిరిగి ఇవ్వాలని ధరణి అడిగాడు. ఎంతకీ ఇవ్వకపోగా, దీప బెదిరింపులకు దిగడంతో, తాను మోసపోయానని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీపపై గతంలో ఇటువంటి కేసులు చాలానే వచ్చాయని, గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చిందని చెప్పిన పోలీసులు, ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని అన్నారు.

More Telugu News