global indian international school: 4 లక్షల ఫీజు వసూలు చేసి... 20 వేల కోసం పిల్లల్ని లైబ్రరీలో నిర్బంధించిన స్కూల్.. హైదరాబాదు శివారులో అమానుషం!

షార్ట్స్‌లో చూడండి
కార్పొరేట్ పాఠశాలల ఫీ'జులుం' మరోసారి హైదరాబాదులో బట్టబయలైంది. తల్లిదండ్రుల నుంచి 4 లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసిన గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 20 వేల రూపాయల బస్సు చార్జీ చెల్లించలేదని విద్యార్థులను తరగతి గదిలోకి అనుమతించకుండా లైబ్రరీలో బంధించిన సంఘటన జాతీయ బాలల హక్కుల సంఘం ముందుకు వచ్చింది.

దాని వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు శివారు ఉప్పల్ సమీపంలోని ఫీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని గ్లోబల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ పాఠశాలలో రమేష్ అనే వ్యక్తి పిల్లలు మహేష్‌ (4వ తరగతి), అనూష (6వ తరగతి) లు చదువుతున్నారు. వారి ఫీజుగా రమేష్ 4 లక్షల రూపాయలు చెల్లించారు. అయితే పాఠశాల బస్సు ఫీజుగా 20 వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా అది చెల్లించడంలో ఆలస్యమైంది. ఈ ఆలస్యాన్ని భరించలేకపోయిన పాఠశాల యాజమాన్యం మూడు రోజులుగా పిల్లలను తరగతి గదిలోకి అనుమతించకుండా లైబ్రరీలో నిర్బంధించింది.

దీంతో విషయం తెలుసుకున్న రమేష్‌, పాఠశాల యాజమాన్యంపై బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన బాలల హక్కుల సంఘం జాతీయ గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు పాఠశాలను సందర్శించి వివాదం వివరాలు తెలుసుకున్నారు. కేవలం 20 వేల రూపాయల కోసం పిల్లలను లైబ్రరీలో బంధించి వేధించిన పాఠశాల యాజమాన్యం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగు లక్షల రూపాయల ఫీజు వసూలు చేసిన పాఠశాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుని పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పిల్లలను మానసికంగా వేధించిన గ్లోబల్‌ స్కూల్‌ యాజమాన్యంపైన, ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన పిల్లల అక్రమ నిర్బంధం, పరిరక్షణ, విద్యా హక్కుకు భంగపాటు, పిల్లల పట్ల క్రూరత్వం తదితర చట్టాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయాలని ఆయన సూచించారు. 
Go Back to Shorts
global indian international school
Hyderabad
school fees

More Telugu News