hyderabad police: హైదరాబాద్ లో 70 వేల మంది నేరస్తులు.. ఇళ్లకు జియో ట్యాగ్ చేస్తున్న పోలీసులు!

  • పాతబస్తీలో 11 వేల మంది నేరస్తులు
  • నేరస్తుల సమగ్ర సర్వే చేస్తున్న హైదరాబాద్ పోలీసులు
  • పూర్తి డేటా సేకరణ
ఇది నిజంగా భయాందోళనలు కలిగించే వార్త. హైదరాబాద్ నగరంలో ఏకంగా 70 వేల మంది నేరస్తులు ఉన్నారు. వీరిలో 11 వేల మంది పాతబస్తీలో నివసిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి నేరాలకు పాల్పడేవారి సంఖ్య 4 వేలు ఉంటుందని ఆయన చెప్పారు.

  హైదరాబాద్ పోలీసులు చేపట్టిన నేరస్తుల సమగ్ర సర్వే ప్రస్తుతం పాతబస్తీలో కొనసాగుతోంది. పాత నేరస్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పాత నేరస్తులు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాన్ని సర్వే చేస్తున్నారు. నేరస్తుల్లో మహిళలు కూడా ఉన్నారు. నేరస్తుల్లో పిక్ పాకెట్స్ దగ్గర్నుంచి, నర హంతకుల వరకు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో సర్వే అని కమిషనర్ తెలిపారు. ప్రతి నేరస్తుడి ఇంటి వద్దకు వెళ్లి, ఇంటిని జియో ట్యాగ్ చేస్తున్నామని, నేరస్తుల ఫొటోలను తీసుకుంటున్నామని చెప్పారు. దీంతో, నేరస్తుడి గురించిన పూర్తి వివరాలు అప్ డేట్ అవుతాయని తెలిపారు. ఈ డేటా పోలీస్ వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
hyderabad police
criminals survey in hyderabad

More Telugu News