Uttam Kumar Reddy: తెలంగాణలో ఆసక్తికర పరిణామం... ఉత్తమ్ కుమార్ ఇంటికి కోదండరామ్!

  • 'కొలువుల కొట్లాట'కు మద్దతివ్వండి
  • కాంగ్రెస్ ను కోరనున్న జేఏసీ నేత
  • ఇప్పటికే బీజేపీ నేత లక్ష్మణ్ తో చర్చలు
తెలంగాణ రాజకీయాల్లో నేడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉండి, ఆపై రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయనతో విభేదించిన జేఏసీ నేత కోదండరామ్, ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవనున్నారు. ఉత్తమ్ ఇంటికి వెళ్లనున్న కోదండరామ్, తాను తలపెట్టిన 'కొలువుల కొట్లాట' సభకు మద్దతు కోరనున్నారని తెలుస్తోంది.

మధ్యాహ్నం 1.30 గంటలకు వీరి కలయిక ఉంటుందని కోదండరామ్ సన్నిహితులు పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ నేత లక్ష్మణ్ ను కలిసి తన నిరసన ప్రదర్శనల గురించి వివరించిన ఆయన, బీజేపీ మద్దతును కూడా కోరారు. తెలంగాణలో ఉద్యోగాల విషయమై, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ పక్కనబెట్టారని కోదండరామ్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
Uttam Kumar Reddy
Kodandaram
Koluvula Kotlata

More Telugu News