Ashish Nehra: ఈడెన్‌లో నెహ్రాను చూసి నవ్వేసిన క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల గుడ్ బై చెప్పిన ఆశిష్ నెహ్రాను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చూసిన క్రికెటర్లు ఒక్క పెట్టున నవ్వేశారు. భారత్-శ్రీలంక మధ్య ఈనెల 16న తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కామెంటరీ చెప్పేందుకు వచ్చిన నెహ్రా జట్టు సభ్యులను కలిశాడు. ఈ సందర్భంగా అతడిని చూసిన క్రికెటర్లు నవ్వాపుకోలేకపోయారు.

క్రికెటర్లు నవ్వడం వెనక కారణం ఉంది. అప్పటి వరకు టీమిండియా జెర్సీతో కనిపించే సహచరుడు సూటు, బూటు, టైతో కొత్త వేషధారణతో కనిపించే సరికి ఆశ్చర్యం నిండిన ముఖాలతో ఒక్కసారిగా నవ్వేశారు. ఈ విషయాన్ని నెహ్రానే స్వయంగా వెల్లడించాడు. కొత్త అవతారంలో కనిపించిన తనను చూసి క్రికెటర్లు నవ్వుకున్నారని పేర్కొన్నాడు. వ్యాఖ్యాతగా తనకు ఇది సరికొత్త అనుభవమని పేర్కొన్నాడు.  సుదీర్ఘంగా కుర్చీలో కూర్చోవాల్సి ఉంటుందని, దీనిని అలవాటుగా మార్చుకుంటానని పేర్కొన్నాడు. నవంబరు 1న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 అనంతరం నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Ashish Nehra
Eden Gardens
Commentator

More Telugu News