అల్లరి చేస్తోందని: అల్లరి చేస్తోందని బాలికపై కూర్చున్న 145 కిలోల మహిళ.. ప్రాణాలు కోల్పోయిన అమ్మాయి!

  • తమ కూతుర్ని అదుపులో పెట్టాలని సదరు మహిళకు చెప్పిన బాలిక తల్లి
  • ప్రాణాలు కోల్పోయిన బాలిక (9) బ‌రువు 33 కిలోలు
  • ఫ్లోరిడాలోని పెన్స‌కోలా ప్రాంతంలో దారుణ ఘటన

కోపం తెచ్చుకున్న‌ ఓ మ‌హిళ (64) తొమ్మిదేళ్ల బాలిక‌పై కూర్చోవ‌డంతో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఫ్లోరిడాలోని పెన్స‌కోలా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ అమ్మాయి బాగా అల్లరి చేస్తోందని ఆమెను మంద‌లిస్తూ అలా కూర్చున్నాన‌ని ఆ మ‌హిళ విచార‌ణ‌లో ఒప్పుకుంది. ఆ బాలిక బ‌రువు 33 కిలోలు కాగా ఆమెప‌ట్ల దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించిన ఆ మ‌హిళ బ‌రువు 145 కిలోలు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, త‌న కుమార్తె లిండ్సా బాగా అల్ల‌రి చేస్తోంద‌ని ఆమెను దారిలో పెట్టాల‌ని ఎడ్మండ్‌ స్మిత్ (62) అనే మ‌హిళ త‌న‌ బంధువైన వెరోనికా (64) సాయం కోరింది.

దీంతో లిండ్సాను దారిలో పెట్టాల‌ని భావించిన వెరోనికా.. ఆ బాలిక కూర్చున్న కుర్చీలోనే ఆమెపై కూర్చుంది. దీంతో ఆ బాలిక‌కు ఊపిరి ఆడ‌లేదు. ఆ బాలిక‌ అపస్మారక స్థితిలోకి చేరడంతో ఆమెను ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. త‌మ కూతురు లిండ్సాను వెరోనికాయే హ‌త్య చేసింద‌ని ఆమె తల్లిదండ్రులు గ్రేస్ స్మిత్ (69), ఎడ్మండ్ స్మిత్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

తన కూతురు ఊపిరి ఆడటం లేదని చెప్పినప్పటికీ, నిందితురాలు త‌న కూతురిపై నుంచి లేవలేదని గ్రేస్ స్మిత్‌ తెలిపాడు. ఆ మ‌హిళ త‌న కూతురిపై దాదాపు పది నిమిషాలకుపైగా కూర్చుంద‌ని ఆరోపించాడు. పోలీసులు నిందితురాలిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. అలాగే, ఆ మ‌హిళ వ‌ద్ద త‌మ‌ బాలిక‌ను విడిచిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లిదండ్రులపై కూడా కేసు న‌మోదు చేసుకున్నారు.  

More Telugu News