: చీఫ్ కోచ్ గా నేను రాగానే జట్టులో ఆనందం కనిపించింది!: రవిశాస్త్రి

టీమిండియా చీఫ్ కోచ్ గా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో ప్రతి ఒక్కరిలో ఆనందం కనిపించిందని రవిశాస్త్రి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, డ్రెస్సింగ్ రూమ్ ఎలా ఉండాలో, వాళ్లెలా ఉండాలని తాను కోరుకుంటానో ఆటగాళ్లందరికీ తెలుసని అన్నారు. అయితే, ఒకరిద్దరు కొత్త క్రికెటర్లు తప్పా, మిగిలిన వాళ్లందరూ పాతవాళ్లేనని చెప్పిన రవిశాస్త్రి, జట్టు డైరెక్టర్ గా దిగిపోవడానికి, మళ్లీ చీఫ్ కోచ్ పదవి చేపట్టడానికి మధ్య విరామం ఎక్కువగా లేకపోవడం కలిసొచ్చిందని అన్నారు.

పద్దెనిమిది నెలలు టీమ్ ఇండియా డైరెక్టర్ గా పని చేసినప్పుడు ఒక వ్యవస్థను నిర్మించుకున్నానని చెప్పారు. అప్పుడు, సహాయక సిబ్బందితో కలిసి పని చేశానని, వారి కొనసాగింపు అవసరమనిపించిందని, అందుకే, తాను చీఫ్ కోచ్ గా ఎంపికయ్యాక మళ్లీ తన బృందాన్ని తాను తీసుకున్నానని అన్నారు. శ్రీలంక పర్యటనలో టీమిండియా విజయంపై ఆయన ప్రస్తావిస్తూ, ఈ గెలుపు కుర్రాళ్ల ఘనతేనని, గెలవాలన్న కసి వారిలో కనిపించిందని, ఈ పర్యటనలో విఫలమైన ఆటగాడు అంటూ ఎవరూ లేరని చెప్పారు. 

More Telugu News