: పాకిస్థాన్ లో మళ్లీ మొదలైన క్రికెట్ సందడి.. వరల్డ్ ఎలెవన్ తో పాక్ జట్టు తొలి టీ20 నేడే!

పాకిస్థాన్ లో మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. సుదీర్ఘ కాలంగా పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశమూ ముందుకు రాకపోవడంతో ఐసీసీ చోరవ చూపి, పాక్ లో వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లతో వరల్డ్ ఎలెవన్ పేరుతో ఒక జట్టును తయారు చేసి, పాకిస్థాన్ టూర్ కి పంపింది. ఈ టూర్ లో భాగంగా మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. 3 మార్చి 2009లో లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో పాక్ జట్టుతో తలపడేందుకు శ్రీలంక జట్టు వెళ్తున్న సమయంలో ముష్కరులు విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా క్రికెటర్లు వెళ్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో పలువురు ఆటగాళ్లు గాయపడగా, భద్రతాసిబ్బంది హతమయ్యారు. ఎలాగోలా బతుకు జీవుడా అంటూ క్రికెటర్లు ప్రాణాలరచేతిలో పెట్టుకుని పాక్ ను వీడారు. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు పాకిస్థాన్ లో ఆడేందుకు ఏ దేశమూ ముందుకు రాలేదు.

ఈ నేపథ్యంలో పీసీబీ ఒత్తిడి నేపథ్యంలో పాక్ లో క్రికెట్ కు పునర్వైభవం రప్పించాలన్న లక్ష్యంతో ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టును పాక్ కు పంపింది. ఈ నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఆటగాళ్లను హోటల్ కు తరలించారు. భారీ భద్రత మధ్య హోటల్ లో వరల్డ్ ఎలెవన్ జట్టు ఆటగాళ్లు అడుగుపెట్టారు. నేటి సాయంత్రం పాకిస్థాన్ తో వరల్డ్ ఎలెవన్ జట్టు ఆటగాళ్లు తలపడనున్నారు. ఈ మ్యాచ్ కు భద్రతగా 9,000 మంది పోలీసులను మోహరించినట్టు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాక్ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దీంతో పాక్ క్రికెట్ అభిమానులు సంతోషపడుతున్నారు. పాక్ లో మరోసారి క్రికెట్ సందడి మొదలైంది. 

More Telugu News