: స్కూల్కి వెళ్లడం ఇష్టంలేక.... బాంబు ఉందని ఫోన్ చేసిన విద్యార్థి
లక్నోలోని క్రిష్ణానగర్లో ఉన్న ఓ పాఠశాలలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చింది. వారు బాంబు స్క్వాడ్తో సహా వచ్చి, విద్యార్థులందరినీ బయటికి పంపి స్కూల్ మొత్తాన్ని ఆరు గంటల పాటు గాలించారు. చివరికి ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారో కనుక్కునేందుకు ప్రయత్నించారు. ఫోన్ స్విచాఫ్ వస్తుండటంతో కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేసి లొకేషన్ కనిపెట్టారు.
క్రిష్ణా నగర్కు దగ్గరలోని ఏక్తా నగర్ నుంచి కాల్ వచ్చినట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి విచారించారు. చివరికి ఆ కాల్ చేసింది అదే స్కూల్లో చదువుకునే ఆరవ తరగతి విద్యార్థి అని తెలిసి షాకయ్యారు. అంతేకాకుండా ఫోన్ ఎందుకు చేశావని ప్రశ్నిస్తే... పిల్లాడు చెప్పిన సమాధానం విని పోలీసులు కంగు తిన్నారు. తనకు పాఠశాలకు వెళ్లాలనిపించలేదని, అందుకే తన తల్లి మొబైల్ నుంచి కాల్ చేసి బాంబు ఉన్నట్లు బెదిరించానని పిల్లాడు చెప్పినట్లు క్రిష్ణా నగర్ సర్కిల్ ఆఫీసర్ లాల్ ప్రతాప్ తెలిపాడు.