: స్టాన్‌ఫోర్డు అధ్యాప‌కుడిగా తెలుగోడు.... వీసా లేకుండానే బోధించే అరుదైన‌ అవ‌కాశం క‌ల్పించిన అమెరికా ప్ర‌భుత్వం

అమెరికాలోని ప్ర‌తిష్టాత్మ‌క వైద్య విశ్వ‌విద్యాల‌యం స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్‌లో `వాస్‌క్యూల‌ర్ స‌ర్జ‌రీ` విభాగంలో స‌హాయ ఆచార్యుడిగా బోధించేందుకు గుంటూరుకు చెందిన డాక్ట‌ర్ మిక్కిలినేని కార్తీక్ ఎంపిక‌య్యారు. యూనివ‌ర్సిటీ కోరిక మేర‌కు కార్తీక్‌కి `ఓ-వ‌న్ఏ` వీసాను అమెరికా ప్ర‌భుత్వం జారీ చేసింది. అంటే వీసా అవ‌స‌రం లేకుండానే అక్క‌డ ఉండి, పాఠాలు బోధించే అవ‌కాశాన్ని ప్ర‌భుత్వం క‌ల్పించింది.

కార్తీక్‌ 2004-10 మ‌ధ్య గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, త‌ర్వాత పీజీ,సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చేయటానికి 2012లో అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌లోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ‘వాస్‌క్యూలర్‌ సర్జరీ’ ఎండీ విద్యను పూర్తి చేశారు. వాస్‌క్యూలర్‌ డిపార్టుమెంట్‌లో మొత్తం 11 సీట్లు ఉంటే అమెరికాయేతర వ్యక్తిగా ఇతనికి మాత్రమే సీటు రాగా మిగిలిన పది మంది అమెరికా దేశానికి చెందినవారే.

ఒకవైపు ఎండీ విద్యాభ్యాసం చేస్తూనే మరో వైపు చదువులో భాగంగానే పరిశోధనల వైపు ఆయన దృష్టిసారించారు. హార్వర్డ్‌ వర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అతని ప్రతిభను గుర్తించి రెండు రీసెర్చ్‌ ప్రాజెక్టులు మంజూరు చేశాయి. ఇప్పటి దాకా స్టాన్‌ఫోర్డు వర్సిటీలో ఓ-వ‌న్ఏ వీసాతో భారత సంతతికి చెందినవారు పనిచేయలేదని కార్తీక్ తెలిపాడు. అమెరికాలో 3200 మంది మాత్రమే వాస్‌క్యూలర్‌ సర్జన్లు ఉండగా భార‌త్‌ లాంటి దేశాల్లో వీరి సంఖ్య చాలా త‌క్కువ‌. అక్టోబరు 1న అధ్యాప‌కుడిగా కార్తీక్‌ బాధ్య‌త‌లు చేపట్ట‌నున్నారు. ఆయ‌న ఈ విశ్వ‌విద్యాల‌యంలో మూడేళ్ల పాటు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుంది. వార్షికంగా అన్ని రాయితీలతో కలిపి రూ.3.25 లక్షల డాలర్లు వేత‌నంగా ఇవ్వ‌నున్నారు.

More Telugu News