: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగండి...ఉగ్రవాదులకు ఆల్ ఖైదా పిలుపు

ఉగ్రవాదులు వ్యూహాలు మార్చుతూ భద్రతా బలగాలను ఏమార్చుతున్నారు. స్పెయిన్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఓ వ్యాన్ ను జనాలపైకి నడిపిన నేపథ్యంలో... నిఘా విభాగాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను హెచ్చరించాయి. ఈ దేశాల్లో ఉగ్రదాడుల నేపథ్యంలో విమానాశ్రయాల్లో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో అక్కడ భారీ దాడులు చేయాలన్న ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా తమ ఉగ్రవాదులకు పశ్చిమ దేశాల్లోని రైలు మార్గాలను లక్ష్యం చేసుకోవాలని పిలుపునిచ్చింది. రద్దీగా ఉండే రైలు మార్గాల్లో పట్టాలు తప్పించడం, రైళ్ల లోపలి నుంచి దాడికి పాల్పడడం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించవచ్చని సూచించింది. ఇందుకు ప్రాణత్యాగం అవసరం లేదని, మళ్లీ మళ్లీ ఇలాంటి దాడులు చేయవచ్చని చెబుతోంది.

ఈ మేరకు అల్ ఖైదా బాంబుల నిపుణుడు ఇబ్రహీం అల్‌ అసిరీ తమ అధికార పత్రిక ‘ఇన్‌ స్పైర్‌’ లో రైలు పట్టాలు తప్పించేందుకు వాడే పేలుడు పదార్థాలు, వాటితో ఎలక్ట్రానిక్‌ పరికరాల సాయం తీసుకోకుండా బాంబులు తయారు చేసే విధానం వంటి వాటిపై 18 పేజల వ్యాసం రాశాడు. తాను చెప్పినట్టు చేస్తే ఆధారాలు కూడా దొరకవని చెప్పాడు. ఈ సందర్భంగా అల్ అసిరీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల పేర్లను ప్రముఖంగా ప్రస్తావించాడు. అంతే కాకుండా అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉందని చెప్పాడు. అమెరికా వ్యాప్తంగా 2,40,000 కి.మీ రైలుమార్గం ఉందని, అమెరికన్లు ఈ మొత్తం మార్గాన్ని ఎక్కడ కాపలా కాయగలరని ప్రశ్నించాడు. అలాగే బ్రిటన్ లో కూడా 18,500 కి.మీ సుదీర్ఘ రైలు వ్యవస్థ ఉందని, ఫ్రాన్స్‌ కు కూడా 29,743 కి.మీ దూరమైన రైల్వే లైన్లు ఉన్నాయని, వాటిని వారు ఎలా కాపాడుకోగలరని అతను ప్రశ్నించాడు. 

More Telugu News