: అమ్మాయిపై వేధింపులు వద్దన్నందుకు వైసీపీ యూత్ లీడర్ దారుణ హత్య.. చిత్తూరు జిల్లా పెద్దమండ్యంలో ఘోరం!

చిత్తూరు జిల్లా పెద్ద మండ్యంలో వైసీపీ యువనేత దారుణహత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దమండ్యం పాతవూరు జెండామాను వీధికి చెందిన కాలవగడ్డ హుసేన్‌బేగ్ కుమారుడు సత్తార్‌బేగ్ (35) కార్పెంటర్‌గా పనిచేస్తూనే మండల వైసీపీ యూత్ లీడర్‌గా పనిచేస్తున్నాడు. అతని బావమరిది ఇమ్రాన్ అదే ఊరిలో ఓ దుకాణం నడుపుతున్నాడు. ఇమ్రాన్ దగ్గరి బంధువు కుమార్తె కాలేజీకి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన హర్షవర్ధన్, అతడి తమ్ముడు విష్ణు, మరో యువకుడు కోతిమణి కలిసి వేధించేవారు. విషయం తెలిసిన ఇమ్రాన్ పలుమార్లు వారిని మందలించాడు.

కక్ష పెంచుకున్న యువకులు మంగళవారం మద్యం తాగి ఇమ్రాన్‌పై రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. దీంతో ఇమ్రాన్ తన బావమరిది సత్తార్‌ను తీసుకుని యువకులను ప్రశ్నించేందుకు వెళ్లాడు. ఎందుకిలా చేశారంటూ సత్తార్ వారిని ప్రశ్నించగా వారు సత్తార్‌పై దాడి చేసి కత్తితో చాతీపై పొడిచారు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు.  వెంటనే అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సత్తార్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News