: పది రోజుల టైం ఇస్తున్నా.. మద్యం షాపులను ధ్వంసం చేస్తాం: రోజా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో యథేచ్ఛగా బార్ లైసెన్సులను ఇస్తున్నారని, ఇళ్ల మధ్యలో వైన్ షాపులు పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రాష్ట్రంలో మహిళలు ఏడుస్తున్నా కేవలం కమీషన్ల కోసం వారిని పట్టించుకోకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకి స్పష్టంగా చెబుతున్నానని, పది రోజుల టైం ఇస్తున్నానని.. రాష్ట్రంలో మద్యం ప్రవాహాన్ని ఆపకపోతే వైన్ షాపులను ధ్వంసం చేస్తామని రోజా హెచ్చరించారు. తాము మహిళలను కూడగట్టుకుని మద్యం షాపులను, బెల్టు షాపులను పగలకొట్టేస్తామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి ఆడపిల్లలులేరు కాబట్టి రాష్ట్రంలోని ఆడపిల్లల బాధ తెలియదని అన్నారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఆ బాధ తెలుస్తుందని, మహిళలు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేదంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ మద్యం బాటిళ్లను పగులకొట్టేస్తామని అన్నారు.