: భువనేశ్వరికి దండం పెట్టాల్సిందే.. ఆమె వేదన ఎవరికి చెప్పుకోగలదు?: షర్మిల 'పంచ్'లు

తన వాగ్బాణాలతో, పంచ్ డైలాగులతో వైకాపా ప్లీనరీలో ప్రసంగించిన షర్మిల, కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు. "దేవుని దృష్టిలో కూడా చంద్రబాబు పాపం పండిపోయింది. ఎదురుగా వచ్చి దాడి చేయాలంటే ధైర్యం ఉండాలి. అది చంద్రబాబుకు ఎప్పుడూ లేదు. ఆయనకు తెలిసిందల్లా వెన్నుపోటు పొడవటమే. ఆయన భార్య భువనేశ్వరి గారికి దండం పెట్టాలి. జన్మనిచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచినా, సొంత తండ్రిని అవమానించి, ఆయన మరణానికి కారణమైనా, ఆ మాంగల్యాన్నే చూసుకుని బతికేస్తోంది.

ఎన్టీఆర్ గారి పటానికి దండం పెట్టుకుంటున్న ప్రతిసారీ, ఆయన కళ్లలోకి చూసే ప్రతిసారీ, ఆ తల్లి మనసులో పడే వేదన పాపం ఎవరికి చెప్పుకోగలదు? చంద్రబాబువి ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలే. మోసపు రాజకీయాలే. నీచమైన దిగజారిన రాజకీయాలు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, వైఎస్ఆర్ ఫోటోలు పెట్టుకుని గెలిచి, జగనన్న పేరు చెప్పుకుని గెలిచిన వారికి, ఆశ చూపించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారు చంద్రబాబు. ఇప్పటికీ వారి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించుకునే దమ్ము ఈ పిరికి చంద్రబాబుకు లేదు" అని దుయ్యబట్టారు. షర్మిల ప్రసంగానికి అమితమైన స్పందన వస్తోంది.

More Telugu News