: ప్రజలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు: చంద్రబాబు పాలనపై జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దారుణ పరిస్థితుల్లో ఉన్నారని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం దావుపల్లిలో ఈ రోజు ఆయన పర్యటించారు. ఆ గ్రామంలోని లాలు నాయక్ అనే మిర్చిరైతు చేసిన అప్పు తీర్చలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర సర్కారు అస్తవ్యస్త విధానాలను పాటిస్తోందని, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రైతు లాలు నాయక్ తాకట్టు పెట్టిన బంగారాన్ని మళ్లీ విడిపించే పరిస్థితి లేకపోవడం, పూర్తిగా అప్పుల్లో కూరుకుపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని జగన్ అన్నారు. పక్కనే నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ వెయ్యి అడుగుల లోతుకు వెళ్తే తప్ప బోర్లలో నీళ్లు పడడం లేదని ఆయన పేర్కొన్నారు.