: బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ చంద్రబాబే చేస్తున్నారు: నారా లోకేష్

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ, అరవై ఏడేళ్ల వయసులో కూడా చంద్రబాబు ఇరవై ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఎల్ ఈడీ విద్యుత్ దీపాలను రిమోట్ ద్వారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల్లో 5 లక్షల ఎల్ఈడీ దీపాలు అమర్చేందుకు కార్యాచరణ ప్రారంభమైందన్నారు. టీడీపీ వేసిన రోడ్లు, స్ట్రీట్ వెలుగుల్లో ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారం చేసుకునేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. గ్రామాల పరిశుభ్రత కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్లు పెడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై లోకేష్ మండిపడ్డారు. ఈ-మెయిల్స్ తో దేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ చేయని నీచమైన పనిని ఆ పార్టీ చేస్తోందన్నారు. కేంద్రంలో నుంచి బయటకు రావాలంటే ఒక్క నిమిషం పట్టదని, అలా చేస్తే రాష్ట్రాభివృద్ధి జరగదని, గ్రామాల అభివృద్ధికి కేంద్ర సర్కార్ సాయం కావాలని అందరూ గుర్తించాలని లోకేష్ పేర్కొన్నారు. 

More Telugu News