: ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళ!

ఓ మ‌హిళ తన ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపిన ఘ‌ట‌న పంజాబ్‌లోని లూధియానాకు 50 కిలోమీటర్ల దూరంలోని భైని డరేరా గ్రామంలో క‌ల‌క‌లం రేపింది. భ‌ర్త‌ను క‌డ‌తేర్చిన త‌రువాత త‌న‌పై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ మృత‌దేహాన్ని చెట్టుకు వేలాడదీసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసింది. త‌న భార్య పెట్టుకున్న‌ వివాహేతర సంబంధానికి స‌ద‌రు భ‌ర్త‌ అడ్డుచెప్ప‌డ‌మే ఆయ‌న ప్రాణాన్ని తీసింది. వివ‌రాల్లోకి వెళితే... వ్యవసాయం, మద్యం వ్యాపారం చేసుకునే బాధితుడు జగ్‌పాల్ సింగ్ భార్య హర్జీత్ కౌర్.. రాజ్‌కోట్‌లోని మ‌రో మద్యం వ్యాపారి దేవీందర్ సింగ్ బిందాతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న జ‌గ్‌పాల్ భార్యను నిలదీసి, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో భ‌ర్త‌పై క‌సి పెంచుకున్న ఆ మ‌హిళ దేవీందర్, అతడి స్నేహితులు సుర్జీత్ సింగ్, మరో ఇద్దరి సాయంతో ఆయ‌న‌ను చంపేసింది. జగ్ పాల్, హర్జీత్‌ కౌర్‌లకు పెళ్లయ్యి 14 ఏళ్లు గడిచింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నాలుగు నెల‌ల క్రితం నుంచి దేవీందర్‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. రెండు రోజుల క్రితం రాత్రిపూట వారి పిల్లలిద్దరూ పక్క గదిలో పడుకుని ఉన్న స‌మ‌యంలో హర్జీత్ కౌర్, దేవీందర్ సింగ్ కలిసి జగ్‌పాల్ గొంతునులిమి చంపేశారు. అనంత‌రం ఇంటి దగ్గర్లో ఉన్న చెట్టుకు ఆ మృతదేహాన్ని వేలాడదీసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆరా తీయ‌గా నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

More Telugu News