: మోదీ, యోగి ఉన్నంతకాలం బాబ్రీ వివాదం తేలదు: బీఎంఏసీ

బాబ్రీ మసీదు, రామ జన్మభూమి విషయమై నెలకొన్న వివాదంలో కోర్టు బయట ఎటువంటి సెటిల్ మెంటుకు తాము అంగీకరించేది లేదని బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ (బీఎంఏసీ) కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ తేల్చిచెప్పారు. బీఎంఏసీ ఆఫీస్ బేరర్లతో సమావేశమైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా నరేంద్ర మోదీ, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నంతకాలం, ఈ విషయంలో ముస్లింలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని, వీరిద్దరూ బీజేపీ కార్యకర్తలని, రామ మందిరంకే మద్దతిస్తారని ఆరోపించారు.

గతంలో పని చేసిన ఏ ప్రధాని కూడా రామ జన్మభూమి, బాబ్రీ మసీదు విషయంలో ఇరు వర్గాల మధ్యా నిలిచి సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని ఆరోపించారు. ఈ కేసును సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరించాలని కోరారు. గతంలోనూ కోర్టు బయట సెటిల్ మెంట్ల దిశగా తాము ప్రయత్నించి విఫలమయ్యామని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా ఇతర న్యాయమూర్తులు ఎవరైనా ముందుకు వచ్చి, రెండు వర్గాలకూ అన్యాయం జరుగకుండా సమస్య పరిష్కారానికి చర్యలు సూచిస్తే, తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు.

More Telugu News