: వేధింపుల బాధితుడి ట్వీట్... వెంటనే స్పందించిన యూపీ ముఖ్యమంత్రి

ఉత్తరప్రదేశ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి పాలనలో తనదైన ముద్ర వేస్తూ, దూసుకుపోతున్న యోగి ఆదిత్యనాథ్, తన ట్విట్టర్ ఖాతాకు వచ్చిన సమస్యపై వెంటనే స్పందించారు. ఓ వేధింపుల కేసులో పోలీసులు సత్వర చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలి కుటుంబ సభ్యుడు డీజీపీ, సీఎం ఆఫీసును ట్యాగ్ చేస్తూ, ట్వీట్ పెట్టగా ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటన హోలీ పర్వదినం నాడు కాన్పూర్ లో జరిగింది. కొందరు స్థానికులు ఓ ఇంట్లోకి జొరబడి ఓ మహిళను, ఆమె కుమార్తెను వేధించారు. అడ్డొచ్చిన ఆమె భర్తపై దాడికి దిగారు.

ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, తన ట్వీట్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ఆపై సీఎం కల్పించుకున్నాక కేసులో కదలిక వచ్చింది. "లక్నోలోని డీజీపీ ఆఫీసు నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ కేసులో సరైన చర్యలు తీసుకోవాలని, నివేదిక సమర్పించాలని నన్ను ఆదేశించారు. ఆ వెంటనే నేను స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను. బాధితులకు వైద్య పరీక్షల నిమిత్తం ఏర్పాట్లు చేయించాను" అని కాన్పూర్ పశ్చిమ ఎస్పీ సచ్చీంద్ర పటేల్ వెల్లడించారు.

More Telugu News