: మోదీ లోక్సభలోకి అడుగు పెట్టగానే.. రెండు నిమిషాల పాటు ‘జై శ్రీరాం’ నినాదాలు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితంగా భారతీయ జనతా పార్టీ పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. విజయగర్వంతో ఉన్న భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యులు ఈ రోజు సభలో జై శ్రీరాం నినాదాలు చేశారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలోకి అడుగు పెడుతుండగా వారంతా 'జై శ్రీరాం', 'జై శ్రీరాం', 'మోదీ.. మోదీ' అంటూ నినదిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. సాధారణంగా అయితే ప్రధానమంత్రి లేదా ఇతర సీనియర్ సభ్యులు ఎవరైనా సభలోకి వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడతారు లేదా నమస్కారం పెడతారు.
అయితే, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీని అభినందించేందుకు బీజేపీ సభ్యులు ఈ రోజు ఇలా చేశారు. దాదాపు రెండు నిమిషాల పాటు ఆ నినాదాలు చేశారు. ఈ రోజు లోక్సభ సమావేశం ప్రారంభం కాగానే లోక్సభ మాజీ సభ్యుడు భూమా నాగిరెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం మోదీ సభలోకి ప్రవేశించగానే బీజేపీ నేతలు ఇలా మోదీకి అభినందనలు తెలిపారు.