: హైదరాబాద్ శ్రీవాసవి కాలేజీ ప్రిన్సిపాల్ కారణంగా పరీక్షలకు దూరమైన వందలమంది విద్యార్థులు.. క్రిమినల్‌ చర్యలకు సిద్ధం

తెలుగు రాష్ట్రాల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే, హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ‌ వాస‌వీ ఇంట‌ర్ కాలేజ్ విద్యార్థులు వంద‌ల మంది ప‌రీక్ష‌ల‌కు దూరంగానే ఉండిపోయారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ కార‌ణంగా వారికి హాల్ టికెట్లు అంద‌లేదన్న విష‌యం తెలిసిందే. నిన్న ఆ విద్యార్థుల త‌ల్లిదండ్రులు కాలేజీముందు ఆందోళ‌న చేసినా లాభం లేకుండా పోయింది. ఇంటర్‌బోర్డు ముందు కూడా ప‌లువురు విద్యార్థులు నిర‌స‌న‌కు దిగారు. అయితే, ఇప్ప‌టికిప్పుడు హాల్‌టికెట్లు ఇచ్చే అవ‌కాశం లేద‌ని చెప్ప‌డంతో విద్యార్థులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. శ్రీవాసవి కళాశాల యాజమాన్యం బోర్డుకు ఫీజు చెల్లించలేదని, వారు విద్యార్థులతో పాటు ఇంటర్‌ బోర్డును కూడా మోసగించారని బోర్డు కార్యదర్శి అశోక్ మీడియాకు తెలిపారు. ఆ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స‌ద‌రు విద్యార్థులు విద్యా సంవత్సరం వృథా కోల్పోకుండా మేలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి అవకాశం ఇస్తామని స్ప‌ష్టం చేశారు.

More Telugu News