: థియేటర్ లో జాతీయగీతం వస్తుండగా నిలబడలేదని దాడికి దిగిన వ్యక్తి!

దేశ పౌరుల్లో జాతీయ‌తా భావం, సమైక్య‌త‌ను నింపేందుకు సినిమాహాళ్లలో చిత్రం ప్రదర్శనకు ముందు జాతీయ గీతాలాపన విధిగా చేయాలని సుప్రీంకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంద‌రు మాత్రం థియేట‌ర్లలో జాతీయ గీతం వ‌స్తున్న‌ప్పుడు మొండిగా వ్య‌వ‌హరిస్తున్నారు. మూడు రంగుల జెండాకు గౌర‌వం ఇవ్వ‌కుండా అలాగే సీట్ల‌కు అతుక్కుపోయి కూర్చొని అహంకారాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ విష‌యం మిగ‌తా ప్రేక్ష‌కులకు అస‌హ‌నాన్ని క‌లిగిస్తోంది. సినిమా సీన్ల‌లో జాతీయ గీతాలాప‌న వ‌చ్చిన స‌మ‌యంలో కూడా దేశ భ‌క్తిగ‌ల పౌరులు లేచి నిల‌బ‌డుతున్నారు. అయితే, వృద్ధులు, వికలాంగులు జాతీయగీతం వ‌స్తున్న‌ప్పుడు లేచి నిల‌బ‌డాల‌ని మాత్రం లేదు. ఇది తెలియ‌ని ఓ వ్యక్తి ఓ వృద్ధుడిపై దాడికి దిగాడు.

బాలీవుడ్ న‌టుడు ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ చిత్రం ప్రదర్శిస్తుండగా ఓ వృద్ధుడిపై ఈ దాడి జరిగింది. ముంబయి శివారు ప్రాంతమైన గోరెగావ్‌లోని ఓ థియేటర్‌లో సినిమా చూడ్డానికి వచ్చిన వారిలో వృద్ధుడైన అమల్‌రాజ్‌ దాసన్‌పై ఈ దాడి జ‌రిగింది. ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో మహావీర్‌ ఫొగట్‌(ఆమిర్‌ఖాన్ పాత్ర‌) కూతురు స్వర్ణ పతకం సాధించిన సమయంలో జాతీయగీతం వ‌స్తుంది. ఆ సమయంలో థియేటర్‌లో ఉన్న వారందరూ నిలబడి జాతీయ గీతానికి గౌర‌వ‌మిచ్చారు. కానీ 59ఏళ్ల దాసన్‌ లేచి నిలబడకపోవడంతో థియేట‌ర్‌లో ఉన్న ఓ వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. అత‌డిపై దాడికి దిగి చెంపఛెళ్లుమనిపించాడు. వృద్ధుడిపై దాడి చేశాడని ఇతరులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి దాడి చేసిన వ్యక్తి శిరీష్‌ మధుకర్‌ని అరెస్టు చేసి ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.

More Telugu News