: ఢిల్లీలో చిన్నారులు, మహిళలపై యాసిడ్ చల్లిన వృద్ధుడు
తన ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై ఓ వృద్ధుడు యాసిడ్ దాడి చేసిన ఘటన ఢిల్లీలోని భరత్ నగర్లో చోటుచేసుకుంది. పిల్లలపై ఆయన యాసిడ్ చల్లే క్రమంలో ఇద్దరు మహిళపై కూడా యాసిడ్ పడింది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసులో దర్యాప్తు జరుపుతూ వివరాలు వెల్లడించారు. తన ఇంటి ముందు ఆడుకుంటూ మంట పెట్టారన్న కోపంతో వినోద్ కుమార్(70) అనే వృద్ధుడు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడని, అయితే పిల్లలు తన మాటలు వినిపించుకోకుండా అలాగే ఆడుకున్నారని, దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వినోద్ కుమార్ సదరు పిల్లలపై యాసిడ్తో దాడి చేశాడని తెలిపారు. ఇంతలో అక్కడే కూర్చున్న ఓ పిల్లాడి తల్లితో పాటు మరో మహిళ పరుగు పరుగున అక్కడి రావడంతో వారిపై కూడా ఆ వృద్ధుడు యాసిడ్ చల్లాడని చెప్పారు. బాధితులంతా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.