: మీ నిర్ణయానికి మద్దతిస్తే ఏదో ఒకరోజు జైలు కెళ్లాలి...అది నాకిష్టం లేదు: బీజేపీకి ఝలక్కిచ్చిన మంత్రి

జార్ఖండ్ లోని అధికార పార్టీకి మంత్రి ఝలక్కిచ్చారు. వివరాల్లోకి వెళ్తే... జార్ఖండ్ లోని మైనింగ్ కంపెనీల హక్కులను పునరుద్ధరించేందుకు నేడు కేబినెట్ భేటీ నిర్వహించారు. దీనిని అధికార బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి  సరయురాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మైనింగ్ కంపెనీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ప్రాథమిక విచారణలో తేలిందని, అదీకాక వాటి విషయం కోర్టులో ఉండడంతో హక్కుల పునరుద్ధరణ సరికాదని వాదించారు. అయినప్పటికీ కేబినెట్ ఆయా కంపెనీల హక్కుల పునరుద్ధరణకు మొగ్గుచూపడంతో ఆగ్రహానికి గురైన ఆయన, తక్షణం ఈ అంశాన్ని వాయిదా వేయాలని సూచించారు.

అలా కాకుండా కంపెనీలకు హక్కులు పునరుద్ధరిస్తే ఏదో ఒకరోజు దీనిపై సీబీఐ విచారణ జరుపుతుందని, అప్పుడు నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలుతుందని, అప్పుడు దోషిగా జైలుకి వెళ్లాల్సి వస్తుందని, తాను అందుకు సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో కేబినెట్ ఆశ్చర్యపోయింది. సొంత పార్టీకి చెందిన నేత అలా అనేసి వెళ్లిపోవడంతో ప్రతిపక్షాలు దీనిపై ఎంత రాద్ధాంతం చేస్తాయోనని బీజేపీ భయపడుతోంది. కాగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేతగా, గతంలో బీహార్ లో దాణాకుంభకోణం వెలికి తీసిన వ్యక్తిగా సరయురాయ్ కి అశేషమైన పేరు ప్రతిష్ఠలున్నాయి.

More Telugu News